చిన్నప్పుడు అమ్మ జోల పాడుతూ ఊయల ఊపింది. అలా ఊయల ఊగుతోంటే, అమ్మ పాటలు వింటూ ఎంతో మత్తుగా నిద్రపోయేదా చిన్నారి. పెరిగి పెద్దయి ఏడేళ్లయినా ఆ ఉయ్యాలలోని హాయిని మర్చిపోలేదనుకుంటా. ఇంట్లో అమ్మ చీరతో కట్టిన ఉయ్యాల కనిపించింది. సరదాగా ఆడుకుందామనుకుంటూ ఆ ఉయ్యాలలో కూర్చుని ఊగసాగింది. చిన్ననాటి రోజులను తలచుకుంటూ ఉయ్యాల ఊగింది. తనను తాను గుండ్రంగా ఉయ్యాలను చుట్టుకుంటూ ఒంటరిగా ఉయ్యాలతో ఆటాడసాగింది. కానీ ఆ పసిపాపకు ఏం తెలుసు. ఆ ఉయ్యాలే ఉరి తాడు అవుతుందని. తన ఉసురు తీస్తుందని. గుండ్రంగా చుట్టుకుని ఒక్కసారిగా ఉయ్యాలను వదలిందా బాలిక. అంతే ఆ ఉయ్యాల వేగంగా చుట్టలు వేసుకుంటూ ఆ పాప గొంతును నులిమేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగిందీ విషాధ ఘటన.
నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో సజ్జనపు రవీంద్ర, సత్యవతికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె మోషికకు ఏడేళ్ల వయసు. రోజూలాగానే శనివారం కూడా రవీంద్ర, సత్యవతి పనికి వెళ్లారు. మోషిత సరదాగా ఆడుకుందామని ఉయ్యాలలో ఊగసాగింది. నిలువుగా ఊగకుండా, ఆ ఉయ్యాలను తనకు చుట్టుకుంది. కొన్ని చుట్టలు చుట్టుకుని వదిలేస్తే, ఆ ఉయ్యాల తనను తిప్పుతోందని భావించింది. కొద్దిసేపు అలాగే ఆడుకుంది. కానీ ఎక్కువసేపు తిరగొచ్చని ఆ ఉయ్యాలను ఎక్కువగా చుట్టుకుని ఒక్కసారిగా వదిలేసి, కళ్లు తిరుగుతాయేమోనని కళ్లు మూసుకుంది. కానీ అలా మూసిన కళ్లను తాను తిరిగి తెరవలేనని ఆ క్షణంలో మోషికకు తెలియలేదు. ఆ ఉయ్యాల చుట్టలు తిరుగుతూ ఆ పాప గొంతుకు ఉరి తాడయింది.మోషిక గొంతును ఆ ఉయ్యాల ఉరితాడయింది. దీంతో ఊపిరి ఆడక ఏడేళ్ల మోషిక ప్రాణాలు వదిలింది. స్థానికులు గమనించి ఆమెను ఉయ్యాలలోంచి కిందకు దించేసరికే పాప ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులు ఆ పాపను పట్టుకుని ఏడుస్తున్న దృశ్యం చూసి స్థానికులు కలత చెందారు. చిన్న కుమార్తె కావడంతో మోషికను చాలా ప్రేమగా చూసేవాళ్లని, అడిగినవన్నీ తెచ్చి ఇచ్చేవారని స్థానికులు చెప్పుకోసాగారు. తమ కళ్ల ముందే ఆడుతూ పాడుతూ ఎదిగిన పాపకు ఇలా జరగడంతో కన్నీటిపర్యంతమయ్యారు.